భూమి స్కామ్లో సియం సలహాదారు: చంద్రబాబు
హైదరాబాద్: వేయి కోట్ల రూపాయల విలువ చేసే భూకుంభకోణం వెనక ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి సలహాదారుతో పాటు మరో ఇద్దరు ఉన్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ కుంభకోణంపై వివరణ ఇవ్వాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా పొప్పాల్గుడా గ్రామంలోని 240 ఎకరాల భూమిని కాందిశీకులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఆయన ఆ వివరణ డిమాండ్ చేశారు. ఈ భూములను ఆర్పి మలానీతో పాటు ఏడుగురికి ఇవ్వాలనే రెవెన్యూ శాఖ కార్యదర్శి రోశయ్య తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని ప్రభుత్వం అనుకోవడమనేది కూడా ఒక నాటకమని ఆయన అన్నారు.
తాను ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఈ వ్యవహారం పెద్ద విషయంగా ముందుకు వచ్చిందని, ఆ సమయంలో అందుకు బాధ్యుడైన అధికారిని తాము సస్పెండ్ చేశామని, దానికి తోడు ఆ భూములను రక్షించామని ఆయన చెప్పారు. తాము రక్షించిన కోట్లాది రూపాయల విలువ చేసే భూములను ఇష్టారాజ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముకుంటోందని ఆయన అన్నారు. కోట్లాది రూపాయల భూములను ఉద్దేశ్యపూర్వకంగానే అన్యాక్రాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.