హీరో మహేష్పై వరంగల్ కోర్టు సీరియస్
హైదరాబాద్: అర్జున్ సినిమా నకిలీ సిడిలు అమ్ముతున్నారని హీరో మహేష్బాబు, దర్శకుడు గుణశేఖర్ వరంగల్లోని ఒక వీడియో దుకాణం యజమానిపై దాడి చేశారన్న కేసు విచారణ రేపు (జులై 6) వరంగల్ కోర్టులో జరుగనుంది. మహేష్బాబు, దర్శకుడు గుణశేఖర్ నిన్ననే వరంగల్ కోర్టులో హాజరు కావలసి ఉండగా, వారు బిజీగా ఉన్నందువల్ల స్వయంగా కోర్టు ముందు హాజరు కాలేకపోయారని వారి తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించుకున్నారు. కానీ న్యాయమూర్తి దీనిని సీరియస్గా తీసుకుని, ఎట్టి పరిస్ధితుల్లో మహేష్బాబు, గుణశేఖర్ రేపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. నిందితులు ఎంత పెద్దవారైనా న్యాయస్ధానాన్ని తక్కువగా చూడకూడదని, చట్టం ముందు అందరూ సమానులేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అర్జున్ సినిమా విజయోత్సవంలో భాగంగా మహేష్బాబు, గుణశేఖర్ వరంగల్ వెళ్ళినప్పుడు ఆ సినిమా పైరేటెడ్ సిడిలను అక్కడ దుకాణాల్లో అమ్ముతున్నారని తెలుసుకున్నారు. మహేష్బాబు స్వయంగా ఒక వీడియో షాపుకు వెళ్ళి నకిలీ సిడీలను కనుగొని, ఆ షాపు యజమానిపై చేయి చేసుకున్నారని అభియోగం. ఆ కేసు విచారణ ఇప్పుడు వరంగల్ కోర్టులో తుది దశలో ఉంది.