ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంలో ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ముస్లిం రిజర్వేషన్లను ఈ విద్యాసంవత్సరంలో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ముస్లిం రిజర్వేషన్ల అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ విద్యాసంవత్సరం ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ముస్లిమ్లకు విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని, ఈ విద్యాసంవత్సరం విద్యాసంస్థల్లో ముస్లిమ్లకు రిజర్వేషన్లు అమలు చేయడానికి అనుమతించాలని కోరే విషయాన్ని కూడా ఫుల్ బెంచ్ ముందు పెట్టాలని సుప్రీంకోర్టు తెలియజేసిందని ఢిల్లీలో వున్న రాష్ట్ర సమాచార పౌరసంబంధాల మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. దాంతో ఈ విషయాన్ని తాము ఫుల్బెంచ్ ముందు పెడతామని ఆయన చెప్పారు.