వరంగల్కు కరీంనగర్ లంకె: క్యాంపుల జోరు
హైదరాబాద్: జిల్లా పరిషత్, మండల పరిషత్ పీఠాలను దక్కించుకోవడానికి రాజకీయ పార్టీలు క్యాంపు రాజకీయాలు చేస్తున్నాయి. తమ తమ సభ్యులను కాపాడుకోవడానికి ఇవి క్యాంపులు నిర్వహిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి వరంగల్ జిల్లాలో మద్దతుకు తెలంగాణ రాష్ట్ర సమితి లంకె పెట్టడంతో కాంగ్రెస్ ఇబ్బందులకు గురవుతోంది. వరంగల్ జిల్లాపరిషత్ చైర్మన్గా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తోంది. దీంతో కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యులను వెంటబెట్టుకుని హైదరాబాద్ వచ్చారు. అయితే తెరాసకు చైర్మన్ పదవి ఇచ్చే ప్రసక్తి లేదని క్రీడలు, సాంస్కృతిక వ్యవహారాల మంత్రి ఎం. సత్యనారాయణ రావు అన్నారు. అధిక జడ్పిటిసీ స్థానాలు దక్కించుకున్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి తెరాస వల్ల జిల్లా పరిషత్ చైర్మన్ పదవి దక్కేట్లు లేదు. కరీంనగర్ జిల్లా జడ్పిటిసి సభ్యులను అనంతరం బెంగుళూరుకు తరలించారు. ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని సత్యనారాయణ రావు చెప్పారు.
వరంగల్ కాంగ్రెస్ జడ్పిటీసి సభ్యులు షిర్డీకి బయలుదేరి వెళ్లారు. వారు షిర్డికి బయలుదేరిన బస్సును భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పచ్చ జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి కాంగ్రెస్కు తెరాస మద్దతు తప్పనిసరి. తమ జడ్పిటిసి సభ్యులు గెలిచిన తర్వాత దైవదర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని మంత్రి చెప్పారు. తమ పార్టీ జడ్పిటిసి సభ్యుల విషయంలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. అయితే పార్టీ రెబెల్ అభ్యర్థి ఐలయ్య హత్య సంఘటనలో దొంతి మాధవరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తేయాలని నర్సంపేట మండలానికి చెందిన ఇద్దరు జడ్పిటిసి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరికి నచ్చజెప్పేందుకు జిల్లా కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా పీఠాన్ని చేజారుకున్న కాంగ్రెస్ జిల్లాలోని అధిక మండల పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకోవడానికి యంపిటిసీ సభ్యులకు విందులు, మందులు ఏర్పాటు చేస్తోంది. తానేమీ తక్కువ తినలేదన్నట్లు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే బాటన నడుస్తోంది.