మహేష్బాబుపై కేసును కొట్టేసిన వరంగల్ కోర్టు
వరంగల్: సినీనటుడు మహేష్బాబుపై నమోదైన దౌర్జన్యం కేసును వరంగల్ కోర్టు గురువారంనాడు కొట్టేసింది. మహేష్బాబు గురువారం వరంగల్ కోర్టుకు హాజరయ్యారు. అర్జున్ సినిమా విజయోత్సవం సందర్బంగా మహేష్బాబు, ఆయన అనుచరులు, దర్శకుడు గుణశేఖర్ ఒక వీడియో షాపుపై దాడి చేశారనే ఆరోపణతో కేసు నమోదైంది. నకిలీ సిడిలు అమ్ముతున్నారనే కోపంతో మహేష్బాబు ఈ దాడికి దిగారని కేసు నమోదైంది. మహేష్బాబు వీడియో షాపుపై దౌర్జన్యం చేసినట్లు సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తెలియజేసింది.
మహేష్బాబు, దర్శకుడు గుణశేఖర్ బుధవారం వరంగల్ కోర్టులో హాజరు కావలసి ఉంది. అయితే బిజీగా ఉన్నందువల్ల స్వయంగా కోర్టు ముందు హాజరు కాలేకపోయారని వారి తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించుకున్నారు. కానీ న్యాయమూర్తి దీనిని సీరియస్గా తీసుకుని, ఎట్టి పరిస్ధితుల్లో మహేష్బాబు, గుణశేఖర్ రేపు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఆయన గురువారం కోర్టుకు హాజరయ్యారు. నిందితులు ఎంత పెద్దవారైనా న్యాయస్ధానాన్ని తక్కువగా చూడకూడదని, చట్టం ముందు అందరూ సమానులేనని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అర్జున్ సినిమా విజయోత్సవంలో భాగంగా మహేష్బాబు, గుణశేఖర్ వరంగల్ వెళ్ళినప్పుడు ఆ సినిమా పైరేటెడ్ సిడిలను అక్కడ దుకాణాల్లో అమ్ముతున్నారని తెలుసుకున్నారు. మహేష్బాబు స్వయంగా ఒక వీడియో షాపుకు వెళ్ళి నకిలీ సిడీలను కనుగొని, ఆ షాపు యజమానిపై చేయి చేసుకున్నారని అభియోగం.