యుపిఎ నుంచి వైదొలగాలని డియంకె యోచన
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) నుంచి వైదొలిగేందుకు డియంకె సిద్ధపడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నైవేలీ లిగ్నైట్ కంపెనీలో పెట్టుబడుల ఉపసంహరణను డియంకె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదే సమయంలో నైవేలీ లిగ్నైట్ కార్మికులను డిమాండ్లను పరిష్కరించాలని కూడా డిమాండ్ చేస్తోంది. ఈ స్థితిలో యుపిఎకు మద్దతు ఇచ్చే విషయాన్ని పునఃసమీక్షిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పారు. తాము మంత్రి వర్గం నుంచి వైదొలిగినా మద్దతు కొనసాగిస్తామని ఆయన చెప్పారు.
డియంకెకు లోక్సభలో 16 మంది సభ్యులున్నారు. యుపిఎ ప్రభుత్వం కొనసాగడానికి డియంకె మద్దతు చాలా అవసరం. ఇదే సమయంలో కేంద్ర మంత్రి, డియంకె నాయకుడు దయానిధి మారన్ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంను కలుసుకున్నారు. తన నిర్ణయాన్ని కరుణానిధి ఈ సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలియజేసే అవకాశాలున్నాయి.
ప్రభుత్వం నుంచి వైదొలుగుతామనే డియంకె బెదిరింపునకు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగివచ్చింది. నైవేలీ, నాల్కోలలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. అంతకు ముందు డియంకె నేత, కేంద్ర మంత్రి దయానిధి మారన్ ప్రధానిని కలిశారు. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ కరుణానిధితో ఫోన్లో మాట్లాడారు.