తొలగింపుపై ఢిల్లీ హైకోర్టుకెక్కిన వేణుగోపాల్
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పదవి నుంచి తనను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్ పి. వేణుగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డాక్టర్ వేణుగోపాల్ తరఫున భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు అరుణ్ జైట్లీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. సంస్థ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారనే ఆరోపణపై కేంద్ర ఆర్యోగ మంత్రి అంబుమని రాందాస్ నేతృత్వంలోని పాలక మండలి వేణుగోపాల్ను డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
డాక్టర్ వేణుగోపాల్ తొలగింపును నిరసిస్తూ ఎయిమ్స్ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు గురువారం కూడా తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో అత్యవసర సేవలకు కూడా విఘాతం కలిగింది. మౌలానా ఆజాద్ వైద్య కళాశాల, లోక్నాయక్ జయప్రకాశ్ ఆస్పత్రి వైద్యులు 24 గంటల సమ్మెకు దిగారు. వారు గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తమ సమ్మెను ప్రారంభించారు. అయితే ఈ ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, క్యాజువాలిటీ సేవలు అందిస్తున్నారు. వైద్యుల సమ్మెతో ఎయిమ్స్లో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. డాక్టర్లు వైద్యం అందించడానికి నిరాకరించడం మొదలు పెట్టిన తర్వాత ఎయిమ్స్ 35 ఏళ్ల హృద్రోగి మరణించాడు. సఫ్దర్గంజ్ ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మరణించాడు.