వేణుగోపాల్ ఉద్వాసనపై హైకోర్టు స్టే
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పదవి నుంచి డాక్టర్ పి. వేణుగోపాల్ను తొలగిస్తూ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. తన తొలగింపును సవాల్ చేస్తూ వేణుగోపాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. వేణుగోపాల్ తరఫున బిజెపి నాయకుడు, సీనియర్ న్యాయవాది అరుణ్ జైట్లీ ఆ పిటిషన్ను దాఖలు చేశారు. ఆ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు వేణుగోపాల్ ఉద్వాసనను నిలిపివేస్తూ శుక్రవారంనాడు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలావుంటే, వేణుగోపాల్ ఉద్వాసనను నిరసిస్తూ ఆందోళనలు సాగుతూనే వున్నాయి. ఎయిమ్స్ డాక్టర్ల, విద్యార్థుల సమ్మె శుక్రవారంనాటికి మూడో రోజుకు చేరుకుంది. రోగులకు చికిత్స అందించేందుకు సమాంతర ఓపిడిలను ప్రారంభించారు. సాయంత్రం వరకు 650 మంది రోగులను చూసినట్లు వైద్యులు చెప్పారు. తమ పోరాటం ప్రభుత్వం పైనా, ఆరోగ్య మంత్రి అణ్బుమని రాందాస్పైనా మాత్రమేనని, రోగులపై కాదని ఎయిమ్స్ రెసిడెంట్ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ బినోద్ పాత్రా అన్నారు. పోలీసులకు, వైద్యులకు మధ్య ఘర్షణ తలెత్తడంతో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ను దించారు. తమను ఎయిమ్స్ ఆవరణను బలవంతంగా తొలగించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వైద్యులు ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని వైద్య కళాశాలల జూనియర్ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు.