వేణుగోపాల్ తొలగింపుపై పార్లమెంటరీ కమిటీ ధ్వజం
న్యూఢిల్లీ: అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ పదవి నుంచి డాక్టర్ పి. వేణుగోపాల్ను తొలగించిన అంశం పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ప్రతిధ్వనించింది. ఆరోగ్య మంత్రి అణ్బుమని రాందాస్ వ్యవహారశైలిని పార్లమెంటరీ కమిటీకి చెందిన పలువురు సభ్యులు తప్పు పట్టారు. వేణుగోపాల్ తొలగింపును వ్యతిరేకిస్తూ సమాజ్వాదీ పార్టీ నేత అమర్సింగ్ నేతృత్వంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని కూడా కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
కాంగ్రెస్కు చెందిన ఎ.కె. అంథోనీ, సుఖ్బన్ కౌర్ కూడా ఆ తీర్మానానికి మద్దతు తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. మనం గౌరవించవలసిన మన దేశపౌరుల్లో డాక్టర్ వేణుగోపాల్ కూడా ఒకరని ఇందిరా గాంధీ ఒకప్పుడు అన్న మాటలను జనతాదళ్ - యునైటెడ్ నేత దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అమర్ సింగ్తో పాటు బిజెపి పార్లమెంటు సభ్యులు మనేకా గాంధీ, ఉదయ్సింగ్ కూడా ఎయిమ్స్ కార్యకలాపాల్లో ఆరోగ్య మంత్రి జోక్యాన్ని తప్పు పట్టారు. ఎయిమ్స్ పాలక మండలిలో సభ్యుడు కూడా అయిన కాంగ్రెస్ నేత కరణ్ సింగ్ మాత్రమే మిగతావారితో విభేదించారు.