అద్దెల పేరుతో మోసం చేస్తున్న యువకుడి అరెస్టు
హైదరాబాద్: ఇండ్ల అద్దె పేరుతో మోసాలు చేస్తున్న ఒక యువకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఫ్లాట్లు అద్దెకు ఇప్పించే ఏజెంట్గా అవతారమెత్తి వేలకు వేల రూపాయలు జేబులో వేసుకొని రాజేష్కుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగులను, ఇతర యువకులను మోసం చేస్తూ వచ్చాడు. ఖరీదైన బంజారాహిల్స్, జూబిలీహిల్స్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుని తన మోసాలను అనంతపురానికి చెందిన రాజేష్ సాగిస్తూ వస్తున్నాడు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - రాజేష్కుమార్ అపార్ట్మెంట్లలోని వాచ్మెన్తో మాట్లాడుకుని వారికి వందో, రెండు వందలో ముట్టజెప్పి ఖరీదైన ఫ్లాట్లను అద్దెకున్నాయంటూ చూపించేవాడు. వారి నుంచి రెండు, మూడు నెలల అద్దెను అడ్వాన్స్గా తీసుకునేవాడు. ఆ తర్వాత బెంగుళూర్కో, చైన్నైకో ఉడాయించేవాడు. తాను బెంగుళూర్కో, చెన్నైకో వెళ్తున్నానని, రేపు వచ్చి ఫ్లాట్లో చేరిపొమ్మని చెప్పేవాడు. తీరా ఆ ఫ్లాట్లో చేరడానికి వెళ్లేసరికి తాము మోసపోయామని గ్రహించేవారు. ఈ రకమైన మోసాలకు సంబంధించి రాజేష్కుమార్పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఐదు, జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి.