30 పియస్యుల మూసివేతకు కుట్ర: టిడిపి
హైదరాబాద్: రాష్ట్రంలోని 30 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నిందని తెలుగుదేశం నాయకుడు విజయరామారావు విమర్శించారు. సంస్కరణల పేరుతో 30 ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులను తొలగించి వాటిని మూసేయడానికి చర్యలు చేపట్టబోతోందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ సంస్థల మూపివేత కుట్రకు వ్యతిరేకంగా తాము ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు.
కార్మికుల స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్యస్) కోసం ప్రపంచ బ్యాంక్ డబ్బులు ఇస్తోందని, ఆ డబ్బులతో కార్మికులను తొలగించి ప్రభుత్వ రంగ సంస్థలను మూసేయబోతోందని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకే ఆ సంస్థల్లోని 70 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతోందని ఆయన అన్నారు. ప్రపంచ బ్యాంక్ ఉద్దేశాలను గమనించే తమ పార్టీ కొన్ని విషయాల్లో వైఖరి మార్చుకుందని ఆయన చెప్పారు. ఉద్యోగాలు తీసేసే దిశగా తాము సంస్కరణలను అమలు చేయలేదని ఆయన చెప్పారు.