తెలంగాణ తీర్మానం చేస్తేనే మద్దతు: తెరాస
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీర్మానం చేస్తేనే జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు కాంగ్రెస్కు తాము మద్దతు ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తీర్మానం చేస్తేనే మద్దతు ఇస్తామని తెరాస తెలియజేసింది. ఈ మేరకు శనివారంనాడు పార్టీ సమీక్షా సమావేశంలో ఈ ప్రతిపాదన పెట్టి చర్చిస్తున్నారు. గతంలో నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకున్నప్పటికీ వారు కాంగ్రెస్తో కూడిపోయారని, కాంగ్రెస్కు మద్దతిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తవచ్చునని, అందువల్ల కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడం కన్నా తెలంగాణకు అనుకూలంగా దాన్ని మలుచుకోవడం మంచిదని కొందరు వక్తలు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయబోమని తెగేసి చెప్తే దాని వల్ల జిల్లా పరిషత్లు తెలుగుదేశం పార్టీకి వెళ్లే ప్రమాదం ఉందని మరికొందరు అన్నారు. చర్చ అనంతరం దీనిపై నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ నిర్ణయం అనంతరం పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు పిసిసి అధ్యక్షుడు కె. కేశవరావుతో సమావేశమై చర్చలు జరుపుతారు.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చైర్మన్ పదవులు దక్కించుకోవడానికి కాంగ్రెస్కు తెరాస మద్దతు అవసరం. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం సమీక్ష కోసం శనివారం ప్రారంభమైన సమావేశానికి పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావు ఆలస్యంగా వచ్చారు. ఆయన వచ్చే వరకు ఎ. నరేంద్ర, తదితర ముఖ్య నాయకులు ఫలితాలపై సమీక్ష జరిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం ఎత్తుగడ మాత్రమేనని, సీట్లు గెలుచుకోవడం తమకు ముఖ్యం కాదని తెరాస నాయకులు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ద్రోహం చేయడం వల్లనే తాము స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఓడిపోయామని తెరాస పార్లమెంటు సభ్యుడు వినోద్కుమార్ అన్నారు. పార్టీని బలోపేతం చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన అన్నారు.