కాంగ్రెస్ చేతిలో ఎన్నికల కమీషన్ కీలుబొమ్మ: బాబు
హైదరాబాద్: ఓటర్ల జాబితాను సవరించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడం ఎన్నికల కమీషన్ అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. విషయం కోర్టు పరిధిలో వుండగా నోటిఫికేషన్ జారీ చేయకూడదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓటు హక్కు కోల్పోయిన 80 లక్షల మందికి ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని పొప్పాల్ గ్రామం వద్ద వేయి కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాందిశీకులకు అప్పగించిన వ్యవహారంలో ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డికి ప్రత్యక్ష ప్రమేయం వుందని ఆయన విమర్శించారు.
గ్రామపంచాయతీ ఎన్నికలకు హడావిడిగా ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఆందోళనకు దిగారు. ఎన్నికల కమీషన్ తీరును వారు తీవ్రంగా విమర్శించారు. 15వ తేదీలోగా ఓటర్ల జాబితాను సవరించాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల కమీషనర్ ఎవియస్ రెడ్డిని కలుసుకోవడానికి తమకు అప్పాయింట్ మెంటు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకుని తమను అవమానించారని వారు విమర్శించారు. తెలుగుదేశం కార్యకర్తల తీరుపై ఎవియస్ రెడ్డి చిందులు తొక్కారు.