టిడిపి, తెరాసలది తమాషా: కేశవరావు
హైదరాబాద్: తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓటర్ల జాబితాలపై ఆరోపణలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలు తమాషా చేస్తున్నాయని, ప్రజాస్వామ్యంపై, చట్టంపై నమ్మకం వుంటే ఎన్నికల ప్రక్రియకు అడ్డుపడకూడదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఓటర్ల జాబితాను సవరించడానికి తగిన అవకాశాలున్నాయని, వాటిని సవరించేందుకు ఆ రెండు పార్టీలు సహకరించాలని ఆయన అన్నారు.
కాగా, కేశవరావు ఆదివారంనాడు తెరాస అధినేత కె. చంద్రశేఖర రావుతో భేటీ అయ్యారు. తెరాస పొత్తు ధర్మాన్ని సరిగా పాటించనందువల్లనే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు, సిపిఐ అభ్యర్థులు ఓడిపోయారని కేశవరావు విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న కెసిఆర్ను పరామర్శించడానికే తాను వచ్చానని ఆయన చెప్పారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను తమకు కేటాయించాలని తెరాస కాంగ్రెస్ను కోరుతోంది. ఈ విషయమై ఈ సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని కేశవరావు చెప్పారు. అయితే పరస్పరం దూషణలు మానుకోవాలని ఇరు పార్టీ నాయకుల మధ్య ఒక అవగాహన కుదిరినట్లు చెబుతున్నారు.