జిల్లా పరిషత్ పదవులపై కాంగ్రెస్కు తలనొప్పులు
హైదరాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎంపికల విషయంలో కాంగ్రెస్కు పలు చోట్ల తలబొప్పి కట్టే పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని చోట్ల సొంత గూటి నుంచే వ్యతిరేకత ఎదురవుతుండగా, కొన్ని చోట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వేస్తున్న పీటముడులు వేయడం కాంగ్రెస్కు తలనొప్పిగా మారింది. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని, వరంగల్, కరీంనగర్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పదవులను కాంగ్రెస్ తెరాసకు కేటాయించింది. అయితే ఈ పొత్తులకు స్థానికంగా అనేక ఇబ్బందులు ఎదరవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తెరాసకు కేటాయించడంతో నిజామాబాద్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మంత్రులు, జడ్పిటిసి సభ్యులు ఉన్న హోటల్ ముందు కాంగ్రెస్ కార్యకర్తులు బైఠాయించి నిరసనలు తెలియజేశారు. తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు. దీంతో మంత్రులు ఈ విషయమై మల్లగుల్లాలు పడుతున్నారు.
కరీంనగర్, వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పదవుల ఎంపికకు హాజరు కాకూడదని తెరాస జడ్పిటిసి సభ్యులు నిర్ణయించుకున్నారు. వీరంతా హైదరాబాద్లో మకాం పెట్టారు. నిజామాబాద్ ఎన్నిక పూర్తయ్యే వరకు మిగతా రెండు జిల్లాల ఎన్నికలను బహిష్కరించాలని తెరాస నిర్ణయించుకుంది. దీంతో సోమవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశానికి తెరాస హాజరు కాలేదు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని మంత్రి ఎం. సత్యనారాయణరావు అనుచరుడు మోహన్కు ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్మారం జడ్పిటిసి సభ్యుడు లక్ష్మణ్కుమార్ కాంగ్రెస్ శిబిరం నుంచి వెళ్లిపోయారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు కూడా గైర్హాజరయ్యారు. తెలుగుదేశం, బిజెపి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వరంగల్ జిల్లా పరిషత్ ఎన్నికల విషయంలో మరింత అయోమయం చోటు చేసుకుంది. వైస్ చైర్పర్సన్ పదవిని తమ పార్టీకి ఇవ్వడాన్ని తెరాస అసమ్మతి సభ్యుడు దుగ్యాల శ్రీనివాసరావు వ్యతిరేకిస్తున్నారు. తెరాసకు వైస్ చైర్మన్ పదవి ఇస్తే తనకు చెందిన జడ్పిటిసి సభ్యులు కాంగ్రెస్కు మద్దతు ఇవ్వబోరని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో పాల్గొనకూడదని తెరాస నిర్ణయించుకుంది. కాగా, ముగ్గురు కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యులు పార్టీ శిబిరం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.