వరంగల్ జిల్లా పరిషత్ పీఠంపై టిడిపి కన్ను
వరంగల్: వరంగల్ జిల్లా పరిషత్ పీఠంపై తెలుగుదేశం పార్టీ కన్ను వేసింది. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల్లో గూడుకట్టుకున్న అసమ్మతితో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని చేజిక్కించుకునే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ వుంది. దానికి తోడు కాంగ్రెస్, తెరాసల మధ్య తలెత్తిన వివాదం కూడా తమకు లాభిస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. సోమవారం జరగాల్సిన చైర్పర్సన్ ఎన్నిక కోరం లేక వాయిదాపడింది. జిల్లా పరిషత్ సమావేశానికి తెలుగుదేశంపార్టీ జడ్పిటిసి సభ్యులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఎన్నిక జరగలేదు.
కాంగ్రెస్, తెరాసల్లోని అసమ్మతి మద్దతు తమకు లభిస్తుందని, దీంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని దక్కించుకుంటామని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ నీచాతినీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని, జడ్పిటిసి సభ్యులను లాక్కుపోయి గదిలో పెట్టి తాళం వేశారని, ఇటువంటి రాజకీయాల్ని తాను గత 20 యేళ్లలో ఎన్నడూ చూడలేదని ఆయన అన్నారు. జడ్పిటిసి సభ్యురాలు పులమ్మకు చైర్పర్సన్ పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మంత్రి రెడ్యానాయక్ నిరసన వ్యక్తం చేస్తూ శిబిరం నుంచి బయటకు వచ్చేశారు. తెరాస అసమ్మతి శాసనసభ్యుడు దుగ్యాల శ్రీనివాసరావు కూడా నిరసన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పదవి తెరాసకు ఇస్తే తన మద్దతుతో గెలిచిన జడ్పిటిసి సభ్యులు మద్దతు ఇవ్వబోరని ఆయన చెప్పారు.