చంద్రబాబుకిది తగదు గాక తగదు: వైయస్
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఎవియస్ రెడ్డిని కించపరిచే విధంగా, ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సుదీర్ఘ కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు తగదని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యల తీరుపై ఆలోచించాలని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రజాస్వామికవాదులకు విజ్ఞప్తి చేశారు. గడువులోగా పంచాయతీలకు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత వుందని ఆయన అన్నారు. గల్లంతైన ఓటర్ల పేర్లను చేర్పించుకోవాల్సి వుండగా, ఆ పని చేయకుండా బురద చల్లే పనినే ముఖ్య కార్యక్రమంగా తెలుగుదేశం పార్టీ పెట్టుకుందని ఆయన అన్నారు. తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసే ప్రయత్నంలో చంద్రబాబునాయుడు ఉన్నారని ఆయన అన్నారు.
80 లక్షల ఓటర్ల పేర్లను ఎక్కడెక్కడ తొలగించారో చంద్రబాబు చెప్పగలుగుతారా?, చెప్పలేకపోతే విమర్శలను వెనక్కి తీసుకుంటారా? అని అడిగారు. తాను తెలుగుదేశం జడ్పిటిసి సభ్యులతో మాట్లాడినట్లు చంద్రబాబునాయుడు విమర్శలు చేయడం దిగుజారుడుతనమని ఆయన వ్యాఖ్యానించారు. ఏ టిడిపి జడ్పిటిసిలతో ముఖ్యమంత్రి మాట్లాడారో చెప్పగలరా? అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు సమయం వచ్చినప్పుడు చెప్తానని చంద్రబాబు ఇచ్చిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు తాను అధికారంలో వున్నప్పుడు చేసిన పనులే మిగతా అందరూ చేస్తారని అనుకుంటారని, చిత్తూరు జిల్లాలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ జడ్పిటిసి భాస్కర్ రెడ్డి తండ్రితో మాట్లాడారని రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు జిల్లా పరిషత్తుల్లో మెజారిటీ సాధించినందుకే విక్టరీ సీన్ చూపించడం చంద్రబాబుకే తగుతుందని ఆయన అన్నారు.