2 టిడిపికి : 3 వాయిదా, మిగతావి కాంగ్రెస్కు
హైదరాబాద్: జిల్లా పరిషత్ పీఠాల్లో రెండింటితో తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తమ పార్టీ సభ్యులు ఇద్దరు కాంగ్రెస్కు ఫిరాయించడంతో అనంతపురం జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవిని తెలుగుదేశం పార్టీ కోల్పోయింది. మూడు జిల్లాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ల మధ్య వివాదాల వల్ల వాయిదా పడే పరిస్థితులు నెలకొన్నాయి. మిగతా చోట్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ల ఎన్నికలు సజావుగా జరిగాయి. వీటన్నింటినీ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. మెదక్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ తన మార్కు రాజకీయాలు చేసింది. తెరాస మద్దతుతో కాంగ్రెస్కు చెందిన బాలయ్య చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగాల్సి వుండగా వాయిదా పడే పరిస్థితిని కాంగ్రెస్ కల్పించింది. ఇరు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు వైస్ చైర్పర్సన్గా తెరాసకు చెందిన ఆశిరెడ్డి ఎన్నిక కావాల్సింది. అయితే తమకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందలేదంటూ చైర్పర్సన్ ఎన్నిక పూర్తి కాగానే కాంగ్రెస్ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైస్ చైర్పర్సన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైస్ చైర్పర్సన్ పదవిని తెరాసకు కేటాయించినట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు అప్పటికే చెప్పారు. అయినా మంత్రి గీతారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జడ్పిటిసి సభ్యులు ఎన్నికను బహిష్కరించారు.
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తెలుగుదేశం పార్టీ సభ్యురాలు సునీతారెడ్డి గెలిచారు. ఒప్పందం మేరకు తెలుగుదేశం పార్టీ వైస్ చైర్పర్సన్ పదవిని సిపియంకు ఇవ్వాల్సి వుంది. అయితే తన కోడలు శ్వేతకు వైస్ చైర్పర్సన్ పదవి కావాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు జ్ఞానేశ్వర్ యాదవ్ పట్టుబట్టారు. దీంతో సిపియంకు ఇవ్వలేకపోతున్నామని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ చెప్పారు. తెలుగుదేశం వైఖరికి నిరసన వ్యక్తం చేస్తూ సిపియం జడ్పిటిసి సభ్యురాలు సమావేశాన్ని బహిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా తెలుగుదేశం పార్టీకి చెందిన రమేష్ రాథోడ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్పర్సన్గా అదే పార్టీకి చెందిన జీవనరావు ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా కాంగ్రెస్కు చెందిన కసిరెడ్డి నారాయణ రెడ్డి, వైస్ చైర్పర్సన్గా సిపిఐకి చెందిన పండరి ఎన్నికయ్యారు. ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో సిపియం, తెలుగుదేశం కూటమిని దురదృష్టం వెంటాడింది. లాటరీలో కాంగ్రెస్కు వైస్ చైర్పర్సన్ పదవి, కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐకి వైస్ చైర్పర్సన్ పదవి దక్కాయి.