తెరాస నేతల మాటలకు హద్దు లేదు: కెకె
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తీరుపై ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు మరోసారి ధ్వజమెత్తారు. ఇష్టం లేకపోతే కూటమి నుంచి వైదొలగాలని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశఃలో తెరాస నాయకులను సవాల్ చేశారు. తెరాస నేత ఎ. నరేంద్ర విమర్శలపై ఆయన ఆగ్రహంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మాట్లాడే తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
తమను నిందించడం తెరాస నాయకుల దిగుజారుడుతనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. తెరాస నాయకులు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీలో ఎవరికి ఇష్టం లేకపోయినా తాను తెరాసను కలుపుకుని పోవడానికి యత్నిస్తున్నానని ఆయన అన్నారు. గత విమర్శలను అన్నింటినీ మరిచిపోయి తెరాసతో పొత్తుకు సిద్ధపడ్డామని ఆయన చెప్పారు. తెరాస నాయకులు ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదని, తాను తెరాస అభ్యర్థులున్న చోట కూడా ప్రచారం చేశానని ఆయన అన్నారు. తెరాస నాయకులకు తమ గురించి మాట్లాడే హక్కు కూడా లేదని ఆయన అన్నారు.