ఉత్కంఠభరితంగా ఎంపిపి అధ్యక్ష ఎన్నికలు
హైదరాబాద్: రాష్ట్రంలోని 22 జిల్లాల్లో మండల పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో మంగళవారం ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. గ్రూపు రాజకీయాలు, ఎత్తులకు పైయెత్తులు సాగుతున్నాయి. కొన్ని చోట్ల పరిస్థితులు పోలీసుల లాఠీచార్జికి కూడా దారి తీశాయి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, వీరఘట్టం మండలాల్లో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో ఎంపిటిసి సభ్యులు గైర్హాజరయ్యారు. వరంగల్ జిల్లాలో 14 మండలాల్లో అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య అవగాహన కుదరకపోవడంతో ఈ అనిశ్చితి చోటు చేసుకుంది. మెదక్ జిల్లా గజ్వెల్లో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసీలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ఈ గ్రూపులు పరస్పర దాడులకు దిగాయి. దీంతో పోలీసులు లాఠీచారి చేశారు. అనంతపురం జిల్లాలో గుత్తి, గుంతకల్ ఎంపిపి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అనంతపురం జిల్లాలో అధిక ఎంపిపిలను కైవసం చేసుకునే అవకాశం తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే జడ్పి ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం నాయకుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో తమ ఎంపిటిసీ సభ్యులను తెలుగుదేశం పార్టీ సభ్యులు చివరి నిమిషం దాకా శిబిరాల్లోనే ఉంచారు.
కర్నూలు జిల్లాలో పార్లమెంటు సభ్యుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, శాసనసభ్యుడు శిఖామణి వర్గీయుల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుడు రఘురామిరెడ్డి ఇంటి ముందు శిఖామణి వర్గీయులు ధర్నాకు దిగారు. కోట్లకు అనుకూలంగా రఘురామిరెడ్డి వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. రఘురామిరెడ్డిని డిసిసి అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని శిఖామణి వర్గీయులు పిసిసి అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావుకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎంపిపి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికలు కోరం లేక వాయిదా పడింది. రంగారెడ్డి జిల్లా నవాబు పేట మండలం ఎన్నిక వాయిదా పడింది. కాం।గెస్లోని ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో తమ ఎంపిటిసి సభ్యుడ్ని కిడ్నాప్ చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండల పరిషత్ ఎన్నికలో గందరగోళం నెలకొంది. వనపర్తి కాంగ్రెస్ శాసనసభ్యుడు జి. చిన్నారెడ్డి వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. నల్లగొండ జిల్లాలో ఫిరాయింపుల జోరు సాగుతోంది. భువనగిరిలో తెలుగుదేశం, సిపియం కూటమికి మెజారిటీ ఉన్నప్పటికీ అధ్యక్ష పదవికి రిజర్వ్ అభ్యర్థి లేకపోవడంతో అది తెరాసకు దక్కబోతోంది. కడప జిల్లా బద్వేలులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంకటేశ్వరరెడ్డిని ఎంపిపి అధ్యక్షపదవికి, మల్లారెడ్డని ఉపాధ్యక్ష పదవికి మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. అయితే మల్లారెడ్డికి ఇద్దరు తెలుగుదేశం సభ్యుడు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఈ సమయంలో ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జి చేశారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులను ఇద్దరిని నక్సలైట్లు బెదిరించారు. బియస్పీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నక్సల్స్ వారిని బెదిరించినట్లు సమాచారం.