పేలుళ్ల దర్యాప్తు: కీలక ఆధారాలు లభ్యం
న్యూఢిల్లీ/ముంబాయి: ముంబాయి పేలుళ్లకు సంబంధించి కీలకమైన ఆధారాలు లభ్యమయ్యాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయటపెడతామని కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ చెప్పారు. ముంబాయి నుంచి పాకిస్థాన్కు రెండు, దుబాయ్కి ఒక ఫోన్ కాల్ వెళ్లినట్లు ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హస్తం గురించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదక వివరాలు అందాక వివరాలు తెలియజేస్తామని మహారాష్ట్ర డిజిపి మీడియా ప్రతినిధులకు చెప్పారు. ఇప్పటి వరకు 183 మృతదేహాలు లభ్యమైనట్లు ఆయన బుధవారం మధ్యాహ్నం తెలిపారు. మొత్తం 174 మంది గాయపడినట్లు ఆయన చెప్పారు. మృతుల సంఖ్య 220 దాకా పెరగవచ్చునని అనుమానిస్తున్నారు.
పక్కా ముందస్తు ప్రణాళికతోనే పేలుళ్లు సంభవించినట్లు డిజిపి తెలిపారు. అన్ని రైల్వే స్టేషన్లలో మెటల్ డిటెక్టర్లతో, డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అంథేరీ రైల్వే స్టేషన్లో ఒక ప్లాస్టిక్ సంచిని పెట్టి పారిపోతున్న యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడ్ని బాంద్రా స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. బాంద్రా రైల్వే స్టేషన్ పేల్చివేతకు కూడా కుట్ర పన్నినట్లు చెబుతున్నారు. ఈ పేలుళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని లష్కర్ - ఎ - తోయిబా ప్రకటించింది. అయితే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రాహీం పాత్రపై బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబాయిలో దావూద్ నిర్మించిన అపార్లమెంట్లను కూల్చివేయడానికి బుధవారం అధికారులు ముహూర్తంగా పెట్టుకున్నారు. దీంతో అధికారుల దృష్టి మళ్లించడానికి అతనే ఈ ఘాతుకానికి పాల్పడి వుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలావుంటే, మహారాష్ట్ర అఖిల పక్ష సమావేశం పేలుళ్లను ఖండించింది. సామరస్యాన్ని కాపాడాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. శాసనసభలో మాత్రం పేలుళ్ల ఘటనలు ప్రకంపనలు సృష్టించాయి. తీవ్రవాదాన్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. దీంతో శాసనసభ అట్టుడికిపోయింది. బాంబు పేలుళ్లకు ఇంటలిజెన్స్ వైఫల్యం కాదని డిజిపి స్పష్టం చేశారు. క్షతగాత్రులకు చేస్తున్న వైద్య సహాయాన్ని కార్యదర్శి స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. క్షతగాత్రుల వైద్యం ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్ రావు దేశ్ముఖ్ చెప్పారు. ముంబాయి పేలుళ్ల ప్రాంతాలను బిజెపి నేత ఎల్.కె. అద్వానీ సందర్శించారు. పేలుళ్లను అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్తో పాటు పలు దేశాల అధినేతలు ఖండించారు.