ముంబాయి పేలుళ్ల మృతులు 190 మంది
ముంబాయి: ముంబాయి శివారులో జరిగిన వరుస బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య 190కి చేరుకుంది. కేవలం 11 నిమిషాల వ్యవధిలో ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించి ముంబాయి నగరాన్ని బీభత్స వాతావరణంలోకి నెట్టేసింది. పేలుళ్లలో గాయపడిన 464 వ్యక్తులను ఆస్పత్రిలో చేర్పించారు. పేలుళ్ల నేపథ్యంలో ముంబాయి వాసులను భయం వీడిపోలేదు. ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్పర్సన్ సోనియా గాంధీ మంగళవారం అర్ధరాత్రి ముంబాయిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు.
ముంబాయి నుంచి వెళ్లే అంతర్రాష్ట్రీయ రైళ్లను రద్దు చేశారు. లోకల్ రైళ్లలో ఎక్కడానికి ప్రజలు భయపడుతున్నారు. లోకల్ రైళ్లను పోలీసు పహరాను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు ఇతర కీలకమైన ప్రాంతాల్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ముఠా ఈ పేలుళ్లకు పాల్పడి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. దావూద్ ముఠాకు లష్కర్ - ఎ - తోయిబా సహకరించి వుండవచ్చునని అనుమానిస్తున్నారు. పేలుళ్లకు ఆర్డియక్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పాఠశాలలకు హాజరు తక్కువగా వుంది. కొన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. మృతుల వివరాలను పోలీసులు www.mumbaipolice.org, అనే వెబ్సైట్లో వుంచారు.