వంద రూపాయలకే నెట్, టీవీ సదుపాయం
హైదరాబాద్: టెలిఫోన్, ఇంటర్నెట్, టివి ప్రసారాలు నెలకు కేవలం వంద రూపాయలకే అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాలో ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నామని డిసెంబరునాటికల్లా అన్ని ముఖ్యమైన గ్రామాలకూ విస్తరిస్తామని ఎ.పి. అక్ష్ బ్రాడ్బాండ్ ప్రాజెక్టు ప్రతినిధులు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి వివరిం చారు. బ్రాడ్బాండ్ ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయం లో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షించారు. ఐటీశాఖ కార్యదర్శి రత్నప్రభ అక్ష్ బ్రాడ్బాండ్ సిఇవో వి.కె.ధిర్, ప్రమోటర్ ఆర్.వి.ఆర్.చౌదరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రమోటర్ చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ, కేబుల్టీవీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయాలకు ఒకే వైర్ ద్వారా వినియోగదారులకు అందజేయడమే ఈ బ్రాడ్బాండ్ ఉద్దేశమని చెప్పా రు. ఈ మూడు సర్వీసులను వందరూపాయలకే అందిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ ప్రాజెక్టును విస్తరించనున్నారు. ప్రాజెక్టు అమలులో ఎదురయ్యే ఇబ్బందులను సత్వరం పరిష్కరించాలని, అనుకున్న ప్రకారం డిసెంబరు ఆఖరుకల్లా అన్ని గ్రామాలకు బ్రాడ్బాండ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు. తొలి విడతలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్లగొండ, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనూ బ్రాడ్బాండ్ అందుబాటులోకి వస్తుందని అధికారులు ఆయనకు వివరించారు.