విద్యార్థులపై ఖాకీల తీరు మీద విచారణ: జానా
హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సెంటర్ల వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరుపై విచారణ జరిపిస్తామని హోం మంత్రి కె. జానారెడ్డి వామపక్షాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఐజి స్థాయి అధికారి ఆ సంఘటనపై విచారణ చేస్తారని ఆయన చెప్పారు. సిపిఐ, పిపియం, న్యూడెమొక్రసీ నాయకులు శుక్రవారం హోం మంత్రిని కలిసి పోలీసుల తీరుపై విచారణకు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
పోలీసుల చర్యపై సమగ్ర దర్యాప్తు చేయించాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థులపై అమానుషంగా ప్రవర్తించిన పోలీసులపై కూడా కేసులు పెట్టాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల తీరు సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునేలా వుందని వారన్నారు. విద్యార్థుల్లో అరాచకశక్తులున్నాయని డిజిపి స్వరణ్జిత్ అన్న నేపథ్యంలో శాఖాపరమైన దర్యాప్తుకు అర్థం లేదని వారన్నారు.