ఏడు కొండలూ తిరుమలేశుడివే: దివాకర్ రెడ్డి
హైదరాబాద్: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి సంబంధించినవి రెండు కొండలు మాత్రమేనని ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఎక్కడా లేదని దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడు కొండలూ తిరుమలేశుడివేనని ఆయన స్పష్టం చేశారు. తిరుమల వివాదంపై ఈ నెల 21, 22 తేదీల్లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. సున్నితమైన విషయాలపై రాద్ధాంతం కూడదని ఆయన సూచించారు. తిరుమలలో క్రైస్తవ ప్రచారం జరుగుతుందనే ప్రచారంలో లేదని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో 42 మంది క్రైస్టవులున్నారనే వార్తల్లో నిజం లేదని, ఒక్క క్రైస్తవుడు కూడా తిరుమలలో లేడని ఆయన చెప్పారు. 42 మంది క్రైస్తవులున్నారని చెబుతున్నవారు ఒక్కరి పేరైనా చెప్పడం లేదని, అలా చెప్తే తగు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తిరుమలలో అన్యమతస్థులున్నారనేది ఊహాగానాలు మాత్రమేనని ఆయన అన్నారు. సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎన్నుకునే మేజర్ గ్రామపంచాయతీలకు 15 లక్షల రూపాయలు, మైనర్ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు నజరానా ఇస్తామని, ఈ మేరకు రేపు ఉత్తర్వులు జారీ చేస్తామని ఆయన చెప్పారు.