స్థానిక సంస్థల ఫలితాలపై ప్రత్యేక కమిటీ: కెకె
హైదరాబాద్: స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డాక్టర్ కె. కేశవరావు చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిలక ఫలితాలను విశ్లేషించడానికి ఆదివారం పిసిసి కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు పలువురు సీనియర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శాసనసభ్యులతో, మంత్రులతో, పార్టీ సీనియర్ నాయకులతో కమిటీ చర్చించి, నివేదికను రూపొందిస్తుందని కేశవరావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
మంత్రులు, శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై దృష్టి పెట్టాలని సీనియర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రిని కోరారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల ఓటమిపై చర్యలు చేపట్టాలని కూడా కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు లాభించిందా, లేదా అనే అంశంపై కూడా సమావేశంలో చర్చించారు. తెరాస తమకు మిత్రపక్షంగానే వుంటుందని కేశవరావు చెప్పారు. తెరాస నాయకుల విమర్శలను పట్టించుకోబోమని ఆయన చెప్పారు.