తెరాసపై ప్రజల్లో అవిశ్వాసం: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తెలంగాణ సాధిస్తుందనే నమ్మకం ప్రజల్లో నశిస్తోందని తల్లి తెలంగాణ ఉద్యమనేత, ప్రముఖ సినీనటి విజయశాంతి అన్నారు. కాంగ్రెస్ను నమ్ముకోవడం వల్లనే తెరాసపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతోందని ఆమె అన్నారు. ఆమె ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఆమె తెరాస అగ్రనేత నరేంద్రతో కలిసి ఆలయానికి వచ్చారు. తెలంగాణ అగ్రనేతలు కె. చంద్రశేఖర రావు, నరేంద్ర పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చినప్పుడు తెలంగాణ తప్పకుండా వస్తుందని ఆమె అన్నారు. అలా అని ఏమంటారు నరేంద్రగారూ! అని పక్కనే ఉన్న నరేంద్రను అడిగారు.
కాంగ్రెస్ను తాను నమ్మడం లేదని, పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలోకి వచ్చినప్పుడే తెలంగాణ సాధించగలమని తాను నరేంద్రకు కూడా చెప్పానని ఆమె అన్నారు. తెలంగాణపై ఇన్ని రోజులైనా కాంగ్రెస్ తేల్చడం లేదని, అందువల్ల దానిపై నమ్మకం పోయిందని ఆమె అన్నారు. తెలంగాణ తప్పకుండా వస్తుందని, దానికి ఎన్ని రోజులు పడుతుందనేది చెప్పడం సాధ్యం కాదని, అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రం అనివార్యమని ఆమె అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎన్ని గుళ్లయినా ఎక్కుతాం, ఎన్ని గుళ్లయినా దిగుతామని ఆమె అన్నారు. తెలంగాణ కోసం తామందరమూ ఉద్యమిస్తామని ఆమె చెప్పారు.