అనివార్యత వల్లనే ఇంజనీరింగ్ ఫీజులు పెంపు: వైయస్
హైదరాబాద్: తప్పనిసరి స్థితిలోనే ఇంజనీరింగ్ కోర్సుల ఫీజులు పెంచాల్సి వచ్చిందని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కాలేజీలు వివిధ సమస్యలను ఎదుర్కుంటున్నాయని, కొన్ని మూత పడే పరిస్థితి వచ్చిందని, ఈ స్థితిలో కొద్దిగా ఫీజులు పెంచామని, దీన్ని అర్థం చేసుకోవడం అవసరమని ఆయన అన్నారు. పిసిసి కార్యవర్గ సమావేశంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలని ఆయన కాంగ్రెస్ నాయకులకు సూచించారు. అయితే ఎస్సి, ఎస్టి, బిసి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం బిసి విద్యార్థులకు ఏడాది 70 కోట్ల పైచిలుకు మాత్రమే స్కాలర్షిప్లు విడుదల చేస్తే తాము 140 కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆయన చెప్పారు.
నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన మాట నిజమేనని, అయితే పెట్రో ఉత్పత్తుల పెరుగుదల వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. ఈ చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం ప్రతిపక్షాలకు తగదని ఆయన అన్నారు. వీలైన అన్న చోట్లా నిత్యావసర సరుకుల ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. పప్పులు, మిర్చి ధరలు పెరిగాయని, చింతపండు వంటివి నిల్వలు ఉన్నాయని, వీటిని తక్కువ ధరలకు అందించడానికి చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు.