శ్రీలంక సిరీస్కు టెండూల్కర్ రెడీ
ముంబాయి: శ్రీలంకలో జరిగే ముక్కోణపు వన్డే క్రికెట్ సిరీస్కు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అర్హత సాధించాడు. భుజానికి తగిలిన గాయం నుంచి అతను పూర్తిగా కోలుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఫిట్నెస్ పరీక్షలో నెగ్గినట్లు భారత క్రికెట్ జట్టు ఫిజియో జాన్ గ్లోష్టర్ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి తన నివేదికను సమర్పించారు. భుజానికి అయిన గాయంతో గత మార్చి నుంచి సచిన్ టెండూల్కర్ క్రికెట్కు దూరంగా వున్నాడు. మార్చిలోనే అతను శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
దీనికి టెండూల్కర్ తనను తాను పరీక్షించుకున్నాడు. ఇంగ్లండులో ఆయన ఇటీవల సెలిబ్రిటీ క్లబ్ లాషింగ్స్ తరఫున క్రికెట్ ఆడాడు. బ్యాటింగ్ చేసే సమయంలోనూ, బంతిని విసిరే సమయంలో ఏ విధమైన ఇబ్బంది కలగడం లేదని టెండూల్కర్ చెప్పాడు. అంతర్జాతీయ పోటీలకు తాను సిద్ధంగా ఉన్నానని అతను చెప్పాడు. శ్రీలంకలో ఆగస్టు 14వ తేదీన ముక్కోణపు వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్లో శ్రీలంక, భారత్లతో పాటు దక్షిణాఫ్రికా కూడా పాల్గొంటోంది. నిజానికి టెండూల్కర్కు ఈ నెల 19వ తేదీన ఫిట్నెస్ పరీక్ష జరగాల్సి వుంది. శ్రీలంక ముక్కోణపు సిరీస్కు భారత క్రికెట్ జట్టు ఎంపిక ఈ నెల 20వ తేదీన జరుగుతుంది.