తిరుమలలో మహిళా క్షురకుల నియామకం
తిరుమల: తిరుమలలోని కళ్యాణకట్టలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి మహిళా క్షురకులను నియమించింది. అన్ని అడ్డంకులు తొలగడంతో ఈ మహిళా క్షురకుల నియామకం జరిగింది. తొలి విడతగా 33 మంది మహిళా క్షురకులను నియమించారు. అన్ని పరీక్షలు నిర్వహించి, మార్కుల ఆధారంగానే మహిళా క్షురకులను నియమించామని టిటిడి అధికారులు అంటున్నారు.
తిరుమలకు యేటా 2 కోట్ల మంది భక్తులు వస్తారు. ఇందులో 40 లక్షల మంది తలనీలాలు సమర్పించుకుంటారు. కళ్యాణకట్టలో మహిళా క్షురకులను నియమించాలని టిటిడి రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకుంది. అయితే దాన్ని అమలు చేస్తూ టిటిడి పాలకమండలి ఏడాది క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే మహిళలను క్షురకులుగా నియమించడం ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధమని ఒక వ్యక్తి కోర్టుకెక్కాడు. ఇలాంటి వివక్ష చూపడం సరి కాదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో టిటిడి మహిళా క్షురకుల నియామకాన్ని చేపట్టింది.