ఐయస్ఐ కార్యకలాపాలు తుడిచిపెట్టండి: వైయస్
హైదరాబాద్: హైదరాబాద్లో ఐయస్ఐ కార్యకలాపాలు సాగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముంబాయి పేలుళ్లు, చత్తీస్ఘడ్లో మావోయిస్టుల హింసాకాండ నేపథ్యంలో ఆయన మంగళవారంనాడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో హోంమంత్రి కె. జానారెడ్డి, పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) స్వరణ్జిత్ సేన్లతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముంబాయి తరహా సంఘటనలు హైదరాబాద్లో జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలక్ష్యం తగదని, తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలను అదుపు చేయడానికి యస్ఐడి, ఇంటలిజెన్స్ విభాగాలను పటిష్టం చేస్తామని హోం మంత్రి కె. జానారెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రైవేట్ ఆస్తులను రక్షించడానికి 2 వేల మంది యస్పియఫ్ సిబ్బందిని నియమిస్తామని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో ఫాక్షన్ హత్యలు ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీశాయని ఆయన అన్నారు. కృషి బ్యాంక్ చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు వ్యవహారం, అనంతపురం జిల్లాలో సోమవారం జరిగిన ముగ్గురు వ్యక్తుల హత్య వంటి విషయాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.