కీచక కమీషనర్ సస్పెన్షన్కు ధర్నా
హైదరాబాద్: కీచక అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా ప్రభుత్వోద్యోగులు బుధవారం ధర్నా చేశారు. ఉపాధి, శిక్షణా శాఖ కమీషనర్ మంగపతిరావు ఒక మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ వారు ఈ ధర్నాకు దిగారు. ఉష అనే మహిళా ఉద్యోగి పట్ల మంగపతిరావు అసభ్యంగా ప్రవర్తించారని, ఈ సమయంలో ఇతర అధికారులు కూడా ఉన్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ఒక తెలుగు దినపత్రిక బయట పెట్టింది.
మంగపతిరావుపై ఉష రెండు రోజుల క్రితం కార్మిక శాఖ మంత్రి జి. వినోద్కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దివాన్కు ఫిర్యాదు చేశారు. దివాన్కు ఆమె రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై వినోద్ విచారణకు ఆదేశించారు. అయినా ఫలితం లేకపోవడంతో బుధవారం మహిళా ఉద్యోగులు ధర్నాకు దిగారు. మంగపతిరావును తొలగించాల్సిందేనని వారు పట్టుబడుతున్నారు. గత మూడు నెలలుగా తనను మంగపతిరావు వేధిస్తున్నారని ఉష అంటున్నారు. అయితే అదేం లేదని మంగపతిరావు బుకాయిస్తున్నారు.