చేత కాకపోతే వైయస్ తప్పుకోవాలి: బాబు
హైదరాబాద్: ప్రభుత్వాన్ని నడపడం చేతకాకపోతే తప్పుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని డిమాండ్ చేశారు. అధికారం నుంచి తప్పుకోవాలే తప్ప ధరలు పెంచొద్దని ఆయన రాజశేఖర రెడ్డికి సూచించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా తెలుగుదేశం పార్టీ గురువారం హైదరాబాద్లోని ఛీఫ్ రేషనింగ్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించింది. మూడు గంటల పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. చంద్రబాబుతో పాటు దేవేందర్ గౌడ్ కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధరల పెరుగుదలకు వైయస్ రాజశేఖర రెడ్డితో పాటు ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా కారణమని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేసి ధరలను అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రధాని మన్మోహన్ సింగ్ను కోరారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన చెప్పారు. పార్లమెంటులో కూడా ఇతర పార్టీలతో కలిసి ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేస్తామని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు నిరసనగా సిపియం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.