బాబుపై, మీడియాపై వైయస్ విసుర్లు
హైదరాబాద్: తొమ్మిదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేసిన పెద్ద మనిషి అసత్యాల ప్రచారంతో బతుకున్నాడని ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్. రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును ఉద్దేశించి అన్నారు. ఒక తెలుగుదినపత్రిక చంద్రబాబుకు అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా కావాలని వార్తలు రాస్తోందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ దినపత్రిక రాసిన వార్తలను, పెట్టిన వార్తా శీర్షికలను ఆయన చదివి వినిపించారు. అవి చంద్రబాబుకు అనుకూలంగా ఎలా వుందో, తమకు వ్యతిరేకంగా ఎలా వుందో సుదీర్ఘంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్యాలకు పెద్ద యెత్తున ప్రచారం కలిగించవద్దని ఆయన మీడియాకు సూచించారు. అసత్యాలు చెప్పడమే ప్రతిపక్షం నిర్వర్తించే పాత్ర అని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కావచ్చునని, వారు తాము చెప్తే వింటారని తాను అనుకోవడం లేదని, అయితే మీడియా కూడా అలా వ్యవహరించకూడదని ఆయన అన్నారు. తప్పు ఉంటే బయటపెట్టండి, సరిదిద్దుకుంటామని ఆయన మీడియాను ఉద్దేశించి వున్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై ఒక ప్రముఖ తెలుగుదినపత్రిక రాసిన పరస్పర విరుద్ధమైన కథనాలను ఆయన మీడియాకు చూపారు. ఇందులో ఏ కథనం నిజమని ఆయన అడిగారు. ప్రాజెక్టులపై ఏవైనా అనుమానాలు వుంటే నివృత్తి చేసుకోవాలని, అలా నివృత్తి చేసుకోవడానికి ఇద్దరు కార్యదర్శులు, సలహాదారు సిద్ధంగా వున్నారని ఆయన చెప్పారు. తాము చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అదనంగా ఏడున్నర లక్షల ఎకరాలకు నీరు అందిస్తామనే మాటకు కట్టుబడి వున్నామని ఆయన అన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలకు ముందు తాను జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల గురించి మాత్రమే మాట్లాడుతూ 90 శాతం కైవసం చేసుకుంటామని చెప్పానని, జడ్పిటిసి, ఎంపిటిసిల గురించి మాట్లాడలేదని, ఇందులో తాను మాట మార్చిందేమీ లేదని ఆయన ఒక వార్తాకథనాన్ని ఉద్దేశిస్తూ అన్నారు. అందుకు సంబంధించి ఆయన వీడియో క్యాసెట్ను మీడియా ప్రతినిధుల కోసం ప్రదర్శించారు. మాట మార్చే గుణం తమ వంటా ఇంటా లేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అవకాశం చిక్కినప్పుడల్లా అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి ఓట్లు ఏ విధంగానూ తగ్గలేదని ఆయన వివరిస్తూ గణాంకాల పత్రాలను అందజేస్తూ వాటిని వివరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చిన ఓట్లను శాసనసభ నియోజకవర్గాలవారీగా విశ్లేషించుకుంటామని, ఓట్లు తగ్గిన నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిస్థితులను విశ్లేషించుకుని ప్రభుత్వ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా బేరీజు వేసుకుంటామని ఆయన చెప్పారు. 11 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం తగ్గిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ఆయన గురువారం సమీక్షించారు. రాష్ట్రంలో మేఘమథనాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దేశ, విదేశీ నిపుణుల పరిశీలన ప్రకారం మేఘమథనం ఫలితాలు ఇచ్చిందని ఆయన చెప్పారు. రిజర్వాయర్లలో నిరుటి కన్నా 200 టియంసిల నీరు అధికంగా వుందని ఆయన చెప్పారు. 14 లక్షల హెక్టార్లలో సాగుకు గడ్డివిత్తనాలను సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.