వ్యక్తిగత తగాదాలేవీ లేవు: దేవేందర్ గౌడ్
హైదరాబాద్: పార్టీలో వ్యక్తిగత తగాదాలు ఏవీ లేవని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత టి. దేవేందర్ గౌడ్ అన్నారు. పోలిట్బ్యూరో సమావేశానంతరం ఏర్పాటయిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ మాటలన్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి వ్యవహార శైలిపై ఆయనతో పాటు కడియం శ్రీహరి బహిరంగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన పోలిట్బ్యూరో సమవేశం వివరాలను వెల్లడించడానికి వీరి నలుగురి చేతనే మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసినట్లు అర్థమవుతోంది.
ఇది వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాదని, పార్టీ విధానాలను, వ్యవస్థను ఏర్పరుచుకుంటే అందుకు అనుగుణంగా ముందుకు పోవచ్చుననేది తన ఉద్దేశమని, ఇక్కడ వ్యక్తిగత తగాదాలకు తావులేదని దేవేందర్ గౌడ్ అన్నారు. పార్టీ సీనియర్ నేతల బహిరంగ వ్యాఖ్యలపై పోలిట్బ్యూరో సమావేశంలో పెద్ద యెత్తున చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై మాట్లాడడానికి పార్టీ పోలిట్బ్యూరో సభ్యులు ఎవరూ ఇష్టపడడం లేదు. బహిరంగ వ్యాఖ్యలు చేయడం వల్ల పార్టీ క్యాడర్కు తప్పుడు సంకేతాలు అందుతాయని, అందువల్ల నేతలు అంతర్గత వ్యవహారాలపై బహిరంగ ప్రకటనలు చేయకూడదని సమావేశంలో అనుకున్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, దీన్ని తమకు అనుకూలంగా మల్చుకోవడానికి కలిసికట్టుగా పని చేయాలని అభిప్రాయపడినట్లు చెప్పారు.