కొసరాజు నోట ఇద్దరు రిటైర్డ్ డిజిపిల పేర్లు
హైదరాబాద్: డిపాజిటర్లను మోసగించిన కృషి బ్యాంకు చైర్మన్ కొసరాజు వెంకటేశ్వరరావు తనకు ఇద్దరు రిటైర్డ్ పోలీసు డైరెక్టర్స్ జనరల్ (డిజిపిల)తో ఉన్న సంబంధాలను వెల్లడించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) విచారణలో వెంకటేశ్వర రావు ఆ ఇద్దరి పేర్లను వెల్లడించారు. ఒక రిటైర్డ్ డిజిపి రాగాల తన పవర్ ప్లాంటులో డైరెక్టర్గా వున్నారని వెంకటేశ్వరరావు తెలియజేసినట్లు ఒక ప్రైవేట్ తెలుగు టీవీ చానల్ వెల్లడించింది. అలాగే మరో రిటైర్డ్ డిజిపి హెచ్.జె. దొర కుమారుడికి తన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చానని వెంకటేశ్వరరావు చెప్పారు.
అయితే వెంకటేశ్వరరావు ఆరోపణలను రాగాల కొట్టిపారేస్తున్నారు. తాను వెంకటేశ్వరరావు కంపెనీలో డైరెక్టర్గా ఎప్పుడూ లేనని ఆయన ఆ తెలుగు టీవీచానల్ ప్రతినిధితో అన్నారు. తనకు బ్యాంకులతో ఏ విధమైన సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తన భార్య కృషి బ్యాంకులో 3 లక్షల రూపాయలు డిపాజిటు చేసిందని ఆయన చెప్పారు. తన భార్య ఆ డబ్బులు డిపాటిజ్ చేస్తున్నట్లు తనకు ముందు చెప్పలేదని, ఆ తర్వాత తనకు ఆ విషయం తెలిసిందని ఆయన అన్నారు.