లండన్లో 26వేల పౌండ్ల విరాళం సేకరించిన అమితాబ్
లండన్: సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇటీవల ముంబాయి బాంబు పేలుళ్ళ బాధితుల సహాయార్థం ఇరవై ఆరు వేల పౌండ్స్ను సేకరించాలనే ఆయన నిర్ణయం అందర్నీ ఆకర్షించింది. దాతలనుంచి ఆ డబ్బు సమకూరింది. డి మాన్ఫోర్ట్ విశ్వవిద్యాలయం కళలకు సంబంధించి అమితాబ్కు గత బుధవారం డాక్టరేట్ ప్రదానం చేసిన సందర్భంగా శుక్రవారం రాత్రి జరిగిన విందుకు అమితాబ్ హాజరయ్యారు. ఈ విందును ప్రముఖ ఎన్.ఆర్.ఐ., లేబర్ పార్టీ ఎం.పి అయిన కీత్ వాజ్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ, తన జీవితంలో మరుపురాని మధురమైన రోజు ఇదని, ఓ ఉత్కృష్టమైన కారణం నేపథ్యంలో మీముందుకు రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మనిషి ప్రాణానికి విలువ లేదు. కాని మనం చేయగలిగిన చిన్న సహాయం ద్వారా మన సానుభూతిని ముంబాయి పేలుళ్ళ బాధిత కుటుంబాలకు తెలియపర్చడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన అన్నారు. తనకు లభించిన ఈ డాక్టరేట్ గౌరవం భారతదేశ చిత్ర పరిశ్రమకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఎనిమిదికి పైగా చిత్రాల్లో నటించడానికి తాను అంగీకరించినట్లు అమితాబ్ తెలిపారు. ఆగస్టు నెలలో కూడా తాను షూటింగ్ నిమిత్తం లండన్ రానున్నానని, షూటింగ్కు అనువైన వాతావరణంతో పాటు మంచి సాంకేతిక పరిజ్ఞానం కూడా లండన్లో ఉందని అమితాబ్ అభిప్రాయ పడ్డారు.