మా విధి మేం నిర్వర్తించాం: జానారెడ్డి
హైదరాబాద్: నల్లమలలోని ఎన్కౌంటర్ స్థలానికి వెళ్తానంటే గద్దర్ను అనుమతిస్తామని, తగిన భద్రత కూడా కల్పిస్తామని హోం మంత్రి కె. జానారెడ్డి అన్నారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో పరిస్థితిని ఆయన సోమవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ కుటుంబ సభ్యులను ఆదుకునే విషయంపై ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో మాట్లాడుతామని ఆయన అన్నారు. రాజ్యాంగం ప్రకారం తమ విధిని తాము నిర్వర్తించామని, ప్రజల రక్షణ కోసమే ఈ ఎన్కౌంటర్లు జరిగాయని ఆయన అన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్పై మెజిస్టీరియల్ విచారణ జరిపిస్తామని జానారెడ్డి చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతారని ఆయన చెప్పారు. మాధవ్ బంధువులు కోరితే మాధవ్ కుమారుడు కార్తిక్ చదువుకు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని, కావాలంటే కార్తిక్కు ఉద్యోగం కూడా ఇస్తామని ఆయన చెప్పారు.
అనుమానాలుంటే ఎవరైనా పోస్టుమార్టమ్కు హాజరు కావచ్చునని ఆయన చెప్పారు. మృతుల అంత్యక్రియల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన చెప్పారు. ఎన్కౌంటర్ బూటకం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడి నక్సలైట్లు నేపాల్లో మాదిరిగా చర్చలకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నక్సలైట్లు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని ఆయన చెప్పారు. మృతదేహాలకు మార్కాపురంలో గానీ ఒంగోలులో గానీ పోస్టుమార్టం నిర్వహిస్తామని ఆయన చెప్పారు. సంఘటనా స్థలానికి హెలికాప్టర్లో ఐదుగురు అధికారులు వెళ్లారని ఆయన చెప్పారు. మృతదేహాలను హైదరాబాద్కు తరలించబోమని ఆయన చెప్పారు. మృతుల్లో ముగ్గురిని గుర్తించామని ఆయనచెప్పారు. మృతుల్లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ను, ఆయన అంగరక్షకులు సుశీల, శ్యామలలను పోలీసులు గుర్తించారు. ఇంకా ఐదుగురిని గుర్తించాల్సి వుంది.