హైదరాబాద్ చేరుకున్న మాధవ్ బంధువులు
హైదరాబాద్: నల్లమల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. మాధవ్ అన్నయ్య కనకయ్య గౌడ్తో పాటు ఇతరులు హైదరాబాద్లో గద్దర్ను కలుసుకున్నారు. మాధవ్ మృతదేహాన్ని సురక్షితంగా తమకు అప్పగించాలని కనకయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్కౌంటర్ మృతుల బంధువులు హైదరాబాద్లోని బాగ్లింగంపల్లిలో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. మాధవ్ స్వగ్రామం కరీంనగర్ జిల్లాలోని శ్రీరాంపూర్ మండలం మండపేట నుంచి వారు హైదరాబాద్ వచ్చారు. మాధవ్, వసంతల కుమారుడు కార్తిక్ ఆదిలాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాడు. పాలు తాగే పసివాణ్ని మాధవ్ అత్తామామలకు అప్పగించారు.
తమ సోదరుడు మాధవ్ను దొరకబట్టి కాల్చినట్లే వుందని కనకయ్య గౌడ్ అన్నారు. నిజమైన ఎన్కౌంటర్ అయితే అవతలి వైపు ఎవరికి ఏమీ కాకుండా ఎలా వుంటుందని ఆయన అన్నారు. కనకయ్య గౌడ్, ఇతర బంధువులు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
నల్లమల ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టుల బంధువులు, ప్రజా సంఘాల నాయకులు మృతదేహాల కోసం సోమవారం సాయంత్రం సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు సుశీల తల్లి ప్రభావతమ్మ మహబూబ్నగర్ జిల్లా నుంచి హైదరాబాద్కు వచ్చింది. ఏదైనా తప్పు చేసి వుంటే పట్టుకుని విచారించాలి గానీ చంపుతారా అని ఆమె అడిగింది. ప్రజా సేవ కోసం తన కూతురు అడవి బాట పట్టిందని, దొంగతనం చేసిందా అని ఆమె రోదిస్తూ అడిగింది. ఎన్కౌంటర్లో మరణించిన వారి మృతదేహాలను హైదరాబాద్కు తరలించాలని ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంధువులు చూడడానికి వీలు కల్పించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా ఆదేశించిందని, ఆ ప్రకారం మృతదేహాలను వారి బంధువులు గుర్తించి తీసుకొని పోవడానికి వీలు కల్పించాలని ఆయన అన్నారు.