మాధవ్ ఎన్కౌంటర్ విద్రోహ చర్యే: సత్యమూర్తి
విజయవాడ: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్కు విద్రోహ చర్యనే కారణమని మాజీ నక్సల్స్ నేత, సూరీడు పార్టీ అధ్యక్షుడు కె.జి. సత్యమూర్తి అలియాస్ శివసాగర్ అన్నారు. పార్టీలోని అంతర్గత విభేదాలే విధ్వంసానికి కారణమవుతున్నాయని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కులవర్గ విభేదాలు మావోయిస్టు పార్టీలో ఎన్కౌంటర్లకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు.
మావోయిస్టు ఉద్యమం నీరుగారిపోతోందని ఆయన విమర్శించారు. మావోయిస్టు పార్టీ ప్రజలను కాకుండా తుపాకులను నమ్ముకుంటోందని ఆయన అన్నారు. శాంతి చర్చలే మావోయిస్టుల కొంప ముంచాయని ఆయన అన్నారు. చర్చల కోసం అప్పటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వచ్చిన తీరు, అనంతరం వెళ్లిపోయిన తీరు ప్రభుత్వానికి నక్సలైట్ల ఆయువుపట్లు పట్టుకోవడానికి వీలు కల్పించిందని ఆయన అన్నారు. మావోయిస్టుల వద్ద తుపాకి ఉంది గానీ ఫిలాసఫీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.