ఎన్కౌంటర్పై న్యాయవిచారణకు టిడిపి డిమాండ్
వరంగల్ నల్లమల ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల అనుమనానాలను నివృత్తి చేయడానికి మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించడం అవసరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మాధవ్ ఎన్కౌంటర్పై ప్రజాసంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని, మాధవ్ ఎన్కౌంటర్ బూటకమేనని అనిపిస్తోందని ఆయన అన్నారు.
నమ్మినవారిని మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయమని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిని, శాంతి చర్చల పేరు చెప్పి నక్సలైట్లను, ప్రజా సమస్యల పేరు చెప్పి వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వమ్ము చేస్తోందని ఆయన అన్నారు. నక్సలైట్లను పిట్టలను కాల్చినట్టు కాల్చి ఎన్కౌంటర్లని పేరు పెడుతోందని, ఎన్కౌంటర్లపై అనుమానాలకు బలం చేకూరుతోందని ఆయన అన్నారు.