మాధవ్ ఎన్కౌంటర్ బూటకం కాదు: వైయస్
హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ ఎన్కౌంటర్ బూటకం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల అదుపులో నక్సలైట్లు ఎవరూ లేరని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఎన్కౌంటర్లు ప్రభుత్వ ఉద్దేశం కాదని ఆయన అన్నారు. నక్సలైట్లు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్రమంగా ఆయుధాలు పట్టుకుని తిరిగేవారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్కౌంటర్ విషయంలో ఎవరూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్యక్తి లేదా గ్రూపు ఆయుధాలు పట్టుకుని సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు కట్టడి చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉందని, అందులో భాగంగానే ఎన్కౌంటర్ జరిగిందని ఆయన వివరించారు. తమకు ఎవరి మీద రాగద్వేషాలు లేవని, తమకు తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్కౌంటర్లో మాధవ్ గాయపడి తప్పించుకున్నట్లు మొదట సమాచారం అందింది. అయితే అతను మరణించినట్లు పోలీసులు ఆ తర్వాత ధృవీకరించారు. కాగా, మావోయిస్టు గుంటూరు జిల్లా కార్యదర్శి జీవన్ మృతుల్లో ఉన్నట్లు మొదట భావించారు. అతను తృటిలో తప్పించుకున్నట్లు గుర్తించారు. ఎన్కౌంటర్లో మరణించినవారిలో ఐదుగురు మహిళా నక్సల్స్ వున్నారు.