మాధవ్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
గుంటూరు: మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ మృతదేహానికి బుధవారం ఉదయం పోస్టుమార్టం నిర్వహించారు. మిగతా మృతదేహాలకు సాయంత్రంలోగా నిర్వహిస్తారు. మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించే సమయంలో గుంటూరు వైద్య కళాశాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. మాధవ్ను ఆయన అన్న కనకయ్యగౌడ్ గుర్తించారు. తమవాడ్ని పోలీసులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన బోరున విలపించారు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని తాము తీసుకోబోమని ఆయన చెప్పారు.
విప్లవ రచయిత వరవరరావు, ప్రజాగాయకుడు గద్దర్ గుంటూరుకు రాలేదు. ఆరెస్టు చేసే అవకాశం ఉండడంతో వారు ఇక్కడికి రాలేదని తెలుస్తోంది. బుధవారం ఉదయం మృతదేహాలు గుంటూరుకు చేరుకున్నాయి. దీంతో పోస్టుమార్టం నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఆస్పత్రిలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. చుట్టుపక్కల దుకాణాలను కూడా మూసివేయించారు. అన్ని మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యేసరికి బుధవారం సాయంత్రం ఏడు గంటల దాటవచ్చునని భావిస్తున్నారు.