కరువుకు ప్రత్యామ్నాయం పాడి: వైయస్
హైదరాబాద్: కరువుకు ప్రత్యామ్నాయంగా పాడిపరిశ్రమను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులను ఆయన బుధవారంనాడు సమీక్షించారు. నీటిని పొదుపుగా వాడాలని ఆయన రైతులకు సూచించారు. వర్షాభావం వల్ల రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పంట నష్టమైందని ఆయన అన్నారు. వ్యవసాయాధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఆయన సూచించారు. నీటి నిల్వలలు కృష్ణా బేసిన్లో బాగానే వున్నాయి గానీ గోదావరి బేసిన్లోనే ఉందని ఆయన అన్నారు.
రైతులకు ధైర్యాన్ని నూరిపోయాలని ఆయన వ్యవసాయాధికారులకు సూచించారు. ఈ ప్రభుత్వం మీది, అన్ని రకాల సహాయం అందిస్తుందనే నమ్మకం కలిగించాలని కూడా ఆయన సూచించారు. శ్రీరాంసాగర్, నిజాంసాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వ పరిస్థితి నిరాశజనకంగా వుండడంతో తెలంగాణ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. వారం, పది రోజుల్లో వర్షాలు వచ్చే అవకాశం వుందని, అయితే ఈలోగా వర్షాభావ పరిస్థితులను తట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం అవసరమని ఆయన అన్నారు.