అవి మతపరమైన రిజర్వేషన్లు కావు: సియం
హైదరాబాద్: ముస్లింలకు తాము మతపరంగా రిజర్వేషన్లు కల్పించలేదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. తాము ముస్లింల వెనుబాటుతనాన్ని ఆధారంగా చేసుకొని రిజర్వేషన్లు కల్పించామని, అందువల్ల కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ వల్ల తమకేమీ ఇబ్బంది లేదని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పవర్గున్యా పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించాలని అడుగుతున్నారని ఆయన అన్నారు.
సినీనటుడు కృష్ణకు సంబంధించిన భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని పరిశీలిస్తున్నామని, దాన్ని విరమించుకోలేదని ఆయన స్పష్టం చేశారు. తాము ఇళ్లు కట్టుకున్నామని, అందువల్ల స్వాధీనం విషయంలో పునరాలోచన చేయాలని కృష్ణ విజ్ఞప్తి పెట్టుకున్నారని, దీన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చే పనిని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం తనకు అప్పగించిందనే ఆరోపణలను ఆయన ఖండించారు. కలలో కూడా అటువంటిది ఊహించడానికి వీలు లేదని, అటువంటి అనైతిక చర్యకు పాల్పడాలని నాయకత్వం ఎన్నడూ కోరదని ఆయన అన్నారు. కర్ణాకటకు చెందిన జనార్దన్ రెడ్డితో కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉందని ఆయన చెప్పారు. భూములను ఏ ప్రయోజనం కోసమైతే తీసుకున్నారో ఆ ప్రయోజనం కోసం వాడకపోతే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను కాపాడడం చాలా కష్టంగా వుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో స్వయంగా భగవంతుడి పాలన సాగుతోందని ఆయన అన్నారు.