భూముల వేలం పాటలను అడ్డుకుంటాం: విపక్షాలు
హైదరాబాద్: ప్రభుత్వ సంస్థ హుడా రంగారెడ్డి జిల్లాలోని విలువైన భూముల అమ్మకానికి నిర్వహిస్తున్న వేలం పాటలను అడ్డుకుంటామని ప్రతిపక్షాలు హెచ్చరించాయి. వేలం పాటలను ఆపించేందుకు విడివిడిగానూ ఉమ్మడిగానూ ఉద్యమాలు చేపడతామని ప్రతిపక్షాల నాయకులు చెప్పారు. భూముల వేలం పాటలకు వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన సదస్సులో ప్రతిపక్షాల నాయకులు పాల్గొన్నారు.
భూముల సేకరణ పేరుతో ప్రభుత్వం పేద రైతులను దోచుకుంటోందని సిపియం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు విమర్శించారు. రైతుల నుంచి తక్కువ ధరకు భూములను సేకరించి, అధిక ధరలకు అమ్మడం అన్యాయమని ఆయన అన్నారు. రైతుల నుంచి సేకరించి భూములను తిరిగి వారికే స్వాధీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు నాయని నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూములను తిరిగి స్వాధీనం చేయని పక్షంలో ప్రభుత్వం ఆ భూములను ఏ ధరకైతే అమ్మిందో ఆ ధరను రైతులకు చెల్లించాలని ఆయన అన్నారు. మధ్యలో లాభాలు ఆర్జించి ప్రభుత్వం ఎందుకు తినాలని ఆయన ప్రశ్నించారు. ఈ సదస్సులో బిజెపి నాయకుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.