పియం భద్రత ఉల్లంఘన: ముగ్గురిపై కేసులు
న్యూఢిల్లీ: ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసం భద్రతా వలయంలోకి అక్రమంగా చొరబడిన ముగ్గురిపై పోలీసులు శుక్రవారంనాడు కేసులు నమోదు చేశారు. మన్మోహన్ సింగ్ అధికార నివాసం ఆవరణలోకి గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అనుమతి లేకుండా చొరబడ్డారు. నల్లరంగు కారులో భద్రతా సిబ్బంది అనుమతి లేకుండా వారు లోనికి ప్రవేశించారు. ఆ ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమీషనర్ కె.కె. పాల్ చెప్పారు. వారిపై నమోదు చేసినవి బెయిల్ తీసుకోవడానికి వీలున్న కేసులే. ఈ విషయాన్ని పోలీసులు వారి తల్లిదండ్రులకు తెలియజేశారు.
ఈ ముగ్గురిలో ఇద్దరు యువతులను జైపూర్కు చెందిన యోగిత, వీణా చౌదరిలుగా గుర్తించారు. వీరు ఎయిర్ సహారా ఉద్యోగులు. మరో యువకుడు ఢిల్లీకి చెందినవాడు. విషయం తెలిసిన వెంటనే ఎయిర్ సహారా ఆ ఇద్దరు యువతులను ఉద్యోగాల నుంచి తొలగించింది. వారు మద్యం సేవించలేదని పరీక్షల్లో తేలింది. మరిన్ని పరీక్షల నిమిత్తం వారి రక్త నమూనాలను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు పంపారు. భద్రతా ఉల్లంఘనేది జరగలేదని ప్రధాని కార్యాలయం తెలియజేసింది. ఎవరైనా ప్రధాని నివాసం రిసెప్షన్ కార్యాలయం వరకు రావచ్చునని, అపాయింట్మెంట్ లభించకపోతే వెళ్లిపోవచ్చునని ప్రధాని మీడియా సలహాదారు సంజయబారు వివరించారు.