రామకృష్ణ లేఖ వెల్లడి ఒక కుట్ర: గద్దర్
హైదరాబాద్: తనను సంజాయిషీ కోరుతూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ మాజీ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జి రామకృష్ణ రాసిన లేఖను బయటపెట్టడం ఒక కుట్ర అని జన నాట్యమండలి కళాకారుడు గద్దర్ అన్నారు. హైదరాబాద్ సమీపంలోని సుభాష్నగర్లో అమర వీరుల స్మారక స్థూపానికి గద్దర్ ఆటంకం కలిగించి పార్టీని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ గద్దర్ను సంజాయిషీ కోరుతూ రామకృష్ణ లేఖ రాసినట్లు ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో ఆదివారం ఒక వార్త ప్రచురితమైంది. దీనిపై గద్దర్ ఆదివారంనాడు వివరణ ఇచ్చారు. లేఖలోని కొన్ని విషయాలనే బయటపెట్టి, మిగతా విషయాలు బయటపెట్టకపోవడం కుట్ర అని ఆయన అన్నారు. వాస్తవాలు త్వరలోనే తెలుస్తాయని ఆయన అన్నారు.
తాను ఆ లేఖకు వివరణ ఇస్తానని ఆయన చెప్పారు. రామకృష్ణ ఆరోపణలకు సంబంధించిన వ్యవహారం అంతర్గత విషయమని ఆయన అన్నారు. ఆ విషయం కూడా చాలా పాతదని ఆయన అన్నారు. ఆ లేఖను తనకు పంపాలని రామకృష్ణ మాధవ్కు పంపడం అనే విషయం వెల్లడి కూడా ఒక కుట్ర అని ఆయన అన్నారు. లేఖలో వాస్తవాలు లేవా? అని అడిగితే సత్యాన్ని వంకరటింకరగా చెప్పడమే కుట్ర అని ఆయన అన్నారు.