రోడ్డు ప్రమాదాలపై జానారెడ్డి ఆందోళన
హైదరాబాద్: ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు తగ్గకపోవడం పట్ల హోం మంత్రి కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అపోలో ఆస్పత్రి, సరూర్నగర్ పోలీసులు సంయుక్త ఏర్పాటు చేసిన థింక్ రోడ్ సేఫ్టీ పేర ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం కార్యక్రమంలో ఆయన ఆదివారంనాడు ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాయని, అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే వున్నాయని ఆయన అన్నారు.
ఇరుకు రోడ్ల వల్ల, మితిమీరిన వేగం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ప్రాథమిక చికిత్సపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, డ్రైవర్లకు తదితరులకు ఆరు వేల మంది శిక్షణ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ అదనపు కమీషనర్ ఎ.కె. ఖాన్, సైబరాబాద్ పోలీసు కమీషనర్ మహేందర్ రెడ్డి, బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు.