వైఎస్, కెకెలకు హైకోర్టు షోక్జ్ నోటీసులు
హైదరాబాద్: హైకోర్టు తీర్పు మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి, పిసిసి అధ్యక్షుడు కె కేశవరావులకు హైకోర్టు న్యాయమూర్తి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. స్ధానిక సంస్ధల ఎన్నికల ముందు ఓటర్ల జాబితాలలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆనాడు ఎన్నికలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్కు అప్పీలు చేయగా ఎన్నికలను యధాతధంగా జరపవచ్చని తీర్పు వెలువడింది. ఓటర్ల జాబితాలపై అనుమానం వ్యక్తం చేసిన సింగిల్ జడ్జి తీర్పు ప్రజలను తప్పుదోవ పట్టించేలా, ఒక పార్టీకి మేలు చేసే విధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆనాడు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు కేశవరావు కూడా అదే విధంగా మాట్లాడారు. కోర్టు తీర్పులను విమర్శించవచ్చు కానీ, న్యాయమూర్తులకు స్వార్ధం ఉందన్న వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ నేరం కిందికి వస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు హైకోర్టు షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చుకోవలసి వచ్చింది. ఆ సంజాయిషీతో హైకోర్టు సంతృప్తి చెందకపోతే వ్యవహారం ఇంకా ముందుకు వెళ్తుంది.